రథసప్తమి విశిష్ఠత

రథసప్తమి విశిష్ఠత

రథసప్తమి విశిష్ఠత

ప్రత్యక్ష దైవం గా  సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధన లో సూర్యోపాసన,సుర్యారాధన ఎంతో ప్రాచీనమైనది.  భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి మరియు లయలలో స్థితి కి ప్రధానమైనటువంటి  సూర్యుడు ప్రత్యక్షం గా పూజలందుకొంటున్నాడు. సూర్యుడు వర్షాన్నిస్తాడు, శరీరానికి కాంతినిస్తాడు, ప్రపంచాన్ని చూడ గల కంటికి వెలుగునిచ్చి అన్నింటినీ చూసే శక్తినిస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాదులు రానీకుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రధాత, ఆర్ఘ్యమిస్తే చాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు.

ఉత్తరాయణ పుణ్య కాలం లో సూర్యుని గమనం దక్షిణ దిశనుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రాహ్మి ముహూర్తం లో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారం లో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యునికి  భూమి దగ్గరవడం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలం గా లభించడం మొదలవుతుంది. సుర్యారాధన వలన విజ్ఞానం, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయిషు, దానం, సత్సంతానం, శారీరిక బలం కలగడమే గాక, సర్వ పాపాలు తొలగుతాయి, వాత, పిత్త, క్షయ, కుష్ఠు వంటి వ్యాదుల సైతం విముక్తి లభిస్తుందని వెదోక్తి.

రాగి ప్రమిద లో ఆవు నెయ్యి తో దీపం వెలిగించి, ఆ దీపాన్ని శిరస్సు పై పెట్టుకొని నీటిలో విడిచి పెట్టాలి. సూర్య గ్రహణం తో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి. జిల్లేడు ఆకుల్ని, రేగి ఆకుల్ని తలపై పెట్టుకుని స్నానమాచరించాలి. నదికిగాని, చెరువుకి గాని వెళ్ళే అవకాశం లేకపోతె ఇంట్లోనైన చెంబు తో నీళ్ళు పోసుకోవాలి. ఈ విధం గా చేయడం వలన సూర్యుని శక్తి మన శరీరమంతా వ్యాపించి ఉత్సాహం నిండుతుంది. శరీరానికి స్వస్థత చేకూరుతుంది.  స్నానానంతరం  జిల్లేడు, రేగు, గరిక, అక్షతలు, చందనాలు కలిపిన నీటి తో కాని, పాలతో కాని రాగి చెంబు గుండా జలాన్ని అర్ఘ్యమివ్వడం శ్రేష్ఠo. ఈ పత్రాలలో సౌరశక్తి విశేషం గా నిక్షిప్తమై ఉంటుంది.

సూర్యుని ముందు కొత్త గిన్నె లో పాలు పొంగించడం చేస్తారు. అలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పోర్లుతాయని నమ్ముతారు. ఈరోజు సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షతలు ఎర్రచందనం తో పూజిస్తే ఆయురారోగ్యాలు, సంతానం కలుగుతుందని ప్రతీతి.

ఈ పవిత్రమైన రోజున గురువుల నుండి మంత్రోపదేశం పొందినా, స్త్రీలు కొత్త నోములు ప్రారంభించినా విశేష ఫలితాలనిస్తుంది.

సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు తనని మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకొంటుంటారు ఆ సమయం లో ఎవరు తనకు బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేక సూర్యారాధన చేయడం, ఇవేమీ చేయలేని వారు నాలుగు దోసిళ్ళ తో నీరు వదిలి అర్ఘం ఇచ్చి నమస్కరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషం గా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు భక్తి శ్రద్దలతో ఆయనకి నమస్కరించిన మాత్రాన ఆయన  అనుగ్రహాన్నికురిపిస్తాడు.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download