మాఘమాసం విశిష్ఠత

మాఘమాసం విశిష్ఠత

 

మాఘ మాసం విశిష్ఠత

లక్ష్మీనారాయణులకి,శివ పార్వతులకి ఎంతో ప్రీతి పాత్రమైనది మాఘ మాసం. అఘము అంటే పాపము. పాపం లేకుండా చేసే నెల మాఘము అంటారు. మాఘమాసం లో ఉదయం విష్ణువాలయం సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది.  మాఘ మాసం లో చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉంది. మన నిత్య జీవితం లో స్నానం ఆచరించడం ఒక భాగం. శరీరాన్ని శుద్ది పరచుకునేందుకు, స్నానం ఆర్ష సంప్రదాయం లో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది. జలం, పవిత్రం చేసే వాటిల్లో ఒకటి. అటువంటి జలం తో స్నానమాచరించడం వలన రూపం, తేజస్సు, ఆరోగ్యం, మనఃస్థిమితం చేకురుతాయి. మాఘస్నానాలు చేసినంత మాత్రాన సర్వ పాపాలు తొలగుతాయి. ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాల తో సమస్త సృష్టి ని ఆరోగ్యవంతం గా చేయగల సమర్ధుడు. అందువల్లనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.  తెల్లవారుఝామున నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తే ఉత్తమం, నక్షత్రాలు లేని సమయం లో చేస్తే మధ్యమం, సూర్యోదయం జరుగుతుండగా చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. సూర్యోదయం తర్వాత చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు.  ఉత్తరవాహినిగా ఉన్న నదుల్లో స్నానమాచరిస్తే ఎటువంటి పంచమహపాతకాలైన నశించి పోతాయి. ముఖ్యం గా వేగం గా ప్రవహించే నీటి లో చేసే స్నానాలు సర్వ శ్రేష్ఠమైనవి. ఈ మాసం లో ప్రయాగ లో స్నానమాచరించినా, కనీసం స్నానమాచరించెటప్పుడు ప్రయాగ ప్రయాగ అంటూ స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదు.  కాశీ లో కాని, గంగాయమున సంగమం లో కాని స్నానమాచరిస్తే నూరురెట్లు అధిక పుణ్యం లభిస్తుంది.

మాఘమాసం లో చేసే దానాలకి అత్యంత ప్రాధాన్యమున్నది. మాఘ శుక్ల సప్తమినాడు గుమ్మడి కాయను, శుక్లపక్ష చతుర్దశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాద రక్షలను  దానం చేస్తే ఇహం లో సుఖసంతోషాలు, మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్ర వచనం. అలాగే ఈ మాసం లో చెరుకు రసం, ఉసిరి దానాలు కుడా ఎంతో ఫలదాయకం. మాఘ మాసం లో బంగారు తులసి దళాన్ని దానం చేయటం వలన అన్ని పాపాలు నశించి సకలాభిశ్టాలు నెరవేరుతాయి. సాలగ్రామ దానం  చేసినవారికి తీసుకొన్నవారికి కుడా శుభం కలుగుతుంది. ఈ మాసం లో చేసే అన్న దానం వలన సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసం లో ప్రతి దినం అన్నదానం చేయలేని వారు, మాఘ మాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని  నువ్వులు పోసి యధాశక్తి బంగారు తో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎటువంటి పాపలైన నశిస్తాయి ముఖ్యం గా త్రివిధ పాపాలు తొలగుతాయి.

మాఘమాసం లో ఆదివారాలు విశిష్ఠమైనవి. ఆదివారం నాడు సూర్యుడిని భక్తి శ్రద్దలతో పూజించి, ఆయనకిష్టమై గోధుమతో చేసిన పదార్ధాన్నికాని తీపి పొంగలి కాని పాయసాన్నికాని నైవేద్యం గా సమర్పిస్తే  ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download